సినీ పరిశ్రమ విషయాల్లో ఏపీ సర్కారు అనవసర జోక్యం చేసుకుంటోంది: బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్

  • తీవ్రరూపు దాల్చిన సినిమా టికెట్ల అంశం
  • ఏపీలో సినిమా థియేటర్లపైనా దాడులు
  • తీవ్రంగా స్పందించిన బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్
  • కక్ష సాధింపు ధోరణి సరికాదని ప్రభుత్వానికి హితవు
ఏపీలో సినిమా టికెట్ల అంశం ప్రభుత్వానికి, చిత్ర పరిశ్రమకు మధ్య అంతరాన్ని పెంచుతోంది. సినిమా థియేటర్లపై తనిఖీలు కూడా అధికమవుతున్నాయి. ఇప్పటికే పలు థియేటర్లు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ స్పందించారు. ఏపీ సర్కారు కొన్ని థియేటర్లనే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటోందని నిలదీశారు. దాడుల పేరుతో సినీ రంగాన్ని లక్ష్యంగా చేసుకుంటారా? అని ప్రశ్నించారు.

తెలుగు సినీ పరిశ్రమకు సంబంధించిన విషయాల్లో ఏపీ సర్కారు అనవసరంగా జోక్యం చేసుకుంటోందని విమర్శించారు. సర్కారు తీరుతో సినిమా రంగ కార్మికులు రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని అన్నారు. కరోనా సంక్షోభం వల్ల ఇప్పటికే సినీ పరిశ్రమ కుదేలైందని, ఇలాంటి సమయంలో ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణి ప్రదర్శించడం సరికాదని హితవు పలికారు.

ప్రభుత్వం ఈ అంశంలోనే కాకుండా, అనేక విషయాల్లో వైఫల్యాల బాటన నడుస్తోందని ఎమ్మెల్సీ మాధవ్ ఆరోపించారు. అందుకే ఈ నెల 28న విజయవాడలో ప్రజాగ్రహ సభ జరుపుతున్నామని, ఈ సభకు బీజేపీ అగ్రనేత ప్రకాశ్ జవదేకర్ కూడా వస్తున్నారని వెల్లడించారు.

PVN Madhav
BJP MLC
Cinema Industry
Tickets
Raids
AP Govt
Andhra Pradesh
Tollywood

More Telugu News